ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగిపోవడంతో విమానాశ్రయాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తొలుత ఈనెల 15 వరకు వాటిని మూసివేయాలని భావించినప్పటికీ పరిస్థితులు మెరుగుపడటంతో వాటిని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. పౌర విమానయాన కార్యకలాపాలు వెంటనే అందుబాటులోకి వస్తాయని, ఈవిషయాన్ని దృష్టిలోఉంచుకొని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విమానాల సేవలు, వివరాలకు సంబంధించిన ఇతర విషయాలు తెలుసుకోవడానికి ప్రయాణికులు ఎయిర్లైన్స్ వెబ్సైట్లను పర్యవేక్షించాలని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్లోని వివిధ ఉగ్రస్థావరాలపై 'ఆపరేషన్ సిందూర్' పేరుతో దాడులు చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో సరిహద్దులకు దగ్గరగా ఉన్న దాడులు జరిగేందుకు అవకాశమున్న చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లూథియానా, భుంటార్, కిషన్గఢ్, పటియాలా, శిమ్లా, ధర్మశాల, భఠిండా, జైసల్మేర్, జోధ్పుర్, లేహ్, బికనేర్, పఠాన్కోట్, జమ్మూ, జామ్నగర్, రాజ్కోట్, భుజ్ తదితర విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. ఇటీవల ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంతో సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో ఈ సేవలను తిరిగి పునరుద్ధరించింది.
తిరిగి ప్రారంభిస్తున్న మూసిన 32 విమానాశ్రయాలు !
May 12, 2025
0
Tags