కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా రూ.2.69 లక్షల కోట్లు చెల్లించాలని ఆర్‌బీఐ నిర్ణయం

Telugu Lo Computer
0


2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను డివిడెండ్‌గా రూ.2.69 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి ఆర్‌బీఐ రూ.2.1 లక్షల కోట్లు చెల్లించింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఈ మొత్తం 27.4 శాతం మేర పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ రూ.87,416 కోట్లు డివిడెండ్‌ రూపంలో చెల్లించింది. ఏటికేడు ఈ మొత్తం పెరుగుతూ వస్తోంది. ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా నేతృత్వంలో ఆర్‌బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు నిర్వహించిన 616వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద మొత్తంలో మిగులు నిధులను బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రిస్క్‌ ముప్పును సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కంటిజెంట్‌ రిస్క్‌ బఫర్‌ లెవల్‌ను కూడా 6.5 శాతం నుంచి 7.50 శాతానికి పెంచింది. ఆర్‌బీఐ ఏటా మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌ రూపంలో చెల్లిస్తుంది. దేశ, విదేశీ సెక్యూరిటీలపై వడ్డీ, సేవలపై రుసుములు-కమీషన్లు, విదేశీ మారకపు ద్రవ్యం లావాదేవీలపై లాభం, అనుబంధ సంస్థల నుంచి ప్రతిఫలం రూపేణ ఆర్‌బీఐకు ఆదాయం లభిస్తుంది. కరెన్సీ నోట్ల ముద్రణ, డిపాజిట్లు, రుణాలపై వడ్డీల చెల్లింపులు, సిబ్బంది జీతభత్యాలు-పింఛన్లు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు, ఆకస్మిక పరిస్థితులు- తరుగుదలకు కేటాయింపులు వంటి వ్యయాలు ఉంటాయి. ఈ ఆదాయ, వ్యయాల మధ్య తేడానే మిగులు నిధులుగా వ్యవహరిస్తారు. ఈ మిగులు నిధులను కేంద్రానికి ఏటా బదిలీ చేస్తుంది. ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ల రూపంలో ఖజానాకు రూ.2.56 లక్షల కోట్లు సమకూరుతాయని ఇటీవల బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)