మైక్రోసాఫ్ట్ సంస్థలో 25 సంవత్సరాలుగా పని చేస్తున్న తన భర్తను ఆకస్మికంగా ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంటూ ఓ మహిళ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సంస్థ చేపట్టిన తాజా ఉద్యోగ తొలగింపుల్లో భాగంగా ఆమె భర్తను ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపింది. అంతేకాకుండా, ఈ తొలగింపు ఆయన 48వ పుట్టిన రోజుకు కొన్ని రోజులు ముందే జరిగిందని, అదే రోజు ఆయన ఆఫీసులో చివరి రోజు అయిందని వివరించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం - ''నా భర్త మైక్రోసాఫ్ట్లో 25 ఏళ్లుగా పనిచేశారు. పెద్దగా సెలవులు తీసుకోకుండా, వారానికి 60 గంటలకిపైగా పని చేశారు. పలు ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఎప్పుడూ బాధ్యతల నుంచి తప్పించుకోలేదు. పండుగల సమయంలో ఇతర ఉద్యోగులకు సెలవులు ఇచ్చేందుకు తాను పనిచేయడమే ఎంచుకున్నారు. కానీ, ఓ కంప్యూటర్ ఆల్గోరిథమ్ ఆయనను తొలగించేందుకు సిఫారసు చేసింది. ఈ మేరకు ఆయనను వదిలేశారు.'' అని రాసుకొచ్చారు. ''ఆయన సంస్థకోసం నిస్వార్థంగా పనిచేశారు. ఎప్పుడూ జీతం పెంచాలి, పదోన్నతి ఇవ్వాలని అడగలేదు. కేవలం తాను చేసే పనిపైనే దృష్టి పెట్టారు. మేము బాధను బయటకు చెప్పుకోవాలని కాదు, కానీ నిస్వార్థ సేవలకు ఈ ప్రపంచం ఇస్తున్న ఫలితం ఇదేనా అని ప్రశ్నించాలి అనిపించి ఈ పోస్ట్ చేశాను'' అని ఆమెప్రశ్నించింది. ఈ లేఆఫ్లో మైక్రోసాఫ్ట్లో ఉన్న మరో ప్రముఖ ఉద్యోగి స్టార్టప్ ఏఐ విభాగ డైరెక్టర్ గాబ్రియేలా ది కెరోజ్ కూడా ఉద్యోగాన్ని కోల్పోయారు. ఆమె ఈ పరిణామం బాధాకరమని చెప్పారు. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, సంస్థలో దాదాపు 6,000 మందిని అంటే 3% ఉద్యోగులను తొలగించింది. వీరిలో అధికంగా మధ్యస్థాయి మేనేజ్మెంట్లో ఉన్నవారే ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగానే ఉద్యోగాలు పోతున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
25 సంవత్సరాలుగా పని చేస్తున్న తన భర్తను ఆకస్మికంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ !
May 19, 2025
0
Tags