ఆహార ధరలను అదుపులోకి తీసుకురావడానికి, ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతం తగ్గించినట్లు కేంద్రం ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. ఈ సుంకం తగ్గింపు మే 31 నుండి అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. వనస్పతి నూనె అవసరాలలో 70 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాల నుండి పామ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ను కొనుగోలు చేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వంటనూనెల ధరలను తగ్గిస్తుందని, తద్వారా మార్కెట్లో డిమాండ్ పెరిగి, పామ్ ఆయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు మరింత పెరుగుతాయని అంచనా. ప్రభుత్వం ముడి పామ్ ఆయిల్, ముడి సోయా ఆయిల్, ముడి సన్ఫ్లవర్ ఆయిల్ పై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని గతంలో ఉన్న 20 శాతం నుండి 10 శాతానికి తగ్గించింది. దీనితో ఈ మూడు రకాల నూనెలపై మొత్తం దిగుమతి సుంకం గతంలో ఉన్న 27.5 శాతం నుండి 16.5 శాతానికి తగ్గుతుంది. ఇవి భారతదేశ వ్యవసాయ సెస్ పరిధిలోకి కూడా వస్తాయి. గత ఒక నెల విషయానికి వస్తే.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వేరుశెనగ నూనె, పామ్ ఆయిల్ ధరలలో తగ్గుదల కనిపించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ డేటా ప్రకారం.. ఏప్రిల్ 30న కిలోకు రూ. 190.44 ఉన్న వేరుశెనగ నూనె ధర మే 30 నాటికి రూ. 188.47కి తగ్గింది. పామ్ ఆయిల్ ధర దాదాపు రూ. 3 తగ్గి, రూ. 137.07 నుండి రూ. 134.09కి చేరింది. అయితే, ఆవ నూనె, వనస్పతి, సోయా ఆయిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు.
ముడి వంట నూనెలపై కస్టమ్స్ డ్యూటీ 10 శాతం తగ్గింపు
May 31, 2025
0
Tags