అనారోగ్యంతో నిత్యానంద స్వామి మరణించారనే వార్తలు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో చాలా మంది ఆయన మృతి చెందారనుకొని నివాళులు అర్పిస్తూ పోస్టులు పెట్టారు. కాగా ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే, నిత్యానంద స్థాపించిన 'కైలాస' దేశం నుంచి ఒక ప్రకటన విడుదల అయింది. ఆ ప్రకటనలో, నిత్యానంద "ఆరోగ్యంగా, సురక్షితంగా, జీవించి, చురుగ్గా ఉన్నారు" అని స్పష్టం చేశారు. "స్వామి నిత్యానంద మరణించారని కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో వ్యాప్తి చేసిన వార్తలను కైలాస ఖండిస్తోంది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. మార్చి 30, 2025న ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు" అని పేర్కొన్నారు. ఈ వాదనను రుజువు చేసేందుకు ఒక లైవ్ స్ట్రీమ్ లింక్ను కూడా జతచేశారు. కైలాస ప్రతినిధులు నిత్యానంద బ్రతికే ఉన్నారని చెప్పినప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నారనే దానిపై ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. ఈ వివాదం ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ఉద్దేశపూర్వకంగా వచ్చిన ఒక ఊహాగానం కావచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిత్యానందపై భారతదేశంలో బలాత్కారం, అపహరణ వంటి ఆరోపణలు వచ్చాయి. నిత్యానంద 2019లో భారతదేశం నుంచి పరారీ అయిన తర్వాత, 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస' అనే ఒక స్వతంత్ర హిందూ రాష్ట్రాన్ని స్థాపించినట్లు ప్రకటించారు.
నిత్యానంద స్వామి మరణించలేదు : కైలాస దేశం
April 02, 2025
0
Tags