బిలావల్ భుట్టో తల్లి బెనజీర్ భుట్టోను, తాత జుల్ఫికర్ అలీ భుట్టోనూ ఎవరో చంపారో గుర్తు చేసుకోవాలని సిందూ నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందంటూ పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ నోరుపారేసుకోవడంపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రిగా 2023 వరకూ పనిచేసిన బిలావల్ భుట్టో ప్రస్తుతం అధికార కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీనిపై శుక్రవారంనాడు జరిగిన ఒక ర్యాలీలో బిలావల్ భుట్టో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నదిలో నీరు పారకపోతే వారి రక్తం పారుతుందని, సింధు నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన పరిరక్షకులం తామేనని భారత్పై అక్కసు వెళ్లగక్కారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయాలకు అతీతంగా భారత్లోని రాజకీయ పార్టీలన్నీ బిలావల్ను దుమ్మెత్తిపోశాయి. బిలావల్ భుట్లో వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడుతూ, ఏమి మాట్లాడుతున్నావో నీకు తెలుసా? అని ప్రశ్నించారు. ''ఆయన తాత, తల్లి విషయంలో ఏమి జరిగింది? ఆయనకు బొత్తిగా తెలియదు. ఆయన తల్లిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. మీ తల్లిని కాల్చిచంపితే అది ఉగ్రవాదం అవుతుంది. అదే ఉగ్రవాదులు మా తల్లుల్ని, ఆడకూతుళ్లను చంపితే ఉగ్రవాదం కాదా?" అని బిలావల్ను ఒవైసీ ప్రశ్నించారు. అణుబాంబులున్నాయంటూ పాక్ నేతలు చేస్తున్న బెదిరింపులను కూడా ఒవైసీ తిప్పికొట్టారు. ''మీరు ఒక దేశంలోకి అడుగుపెట్టి అమాయకులను చంపుతుంటే ఏ దేశం కూడా మౌనంగా చూస్తూ ఊరుకోదు. ఎవరు అధికారంలో ఉన్నారనేది కాదు ఇక్కడ ప్రశ్న. మా దేశంపై దాడికి పాల్పడిన విధానాన్ని ప్రశ్నిస్తున్నాం. మతం అడిగి మరీ ప్రాణాలు తీశారు. మీరు అసలు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారీజ్ (అరబ్ భాషలో తీవ్రవాదులు) కంటే దారుణంగా ఉన్నారు. మీరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు'' అని అన్నారు.
బెనజీర్ భుట్టో, జుల్ఫికర్ అలీ భుట్టోనూ ఎవరో చంపారో బిలావల్ గుర్తు చేసుకోవాలి : అసదుద్దీన్ ఒవైసీ
April 28, 2025
0
Tags