ఈరోజు ట్రేడింగ్ ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 79,343.63 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. క్రితం ముగింపు 79,212.53తో పోలిస్తే ఇది సానుకూల ఆరంభం. అయితే, అక్కడి నుంచి సెన్సెక్స్ వెనుదిరిగి చూడలేదు. కొనుగోళ్ల మద్దతుతో రోజంతా లాభాల్లోనే పయనించిన సూచీ, ఇంట్రాడేలో ఏకంగా 80,321.88 పాయింట్ల వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 1005.84 పాయింట్ల భారీ లాభంతో 80,218.37 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది. బలమైన కొనుగోళ్ల మద్దతుతో 289.15 పాయింట్ల లాభంతో 24,328.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీకి ఇది 1.20 శాతం వృద్ధి. ఈ లాభాల జాతరతో మదుపర్ల సంపద గణనీయంగా పెరిగింది. మార్కెట్లు ఈ స్థాయిలో పరుగులు పెట్టడానికి అనేక సానుకూల అంశాలు దోహదపడ్డాయి. వాటిలో ప్రధానంగా దేశీయ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను మించి రాణించడం మార్కెట్ సెంటిమెంట్ను బలోపేతం చేసింది. ఫలితాల ప్రభావంతో రిలయన్స్ షేరు ఒక్కరోజే దాదాపు 5 శాతం పెరిగి రూ.1366 స్థాయికి చేరింది. మార్కెట్ వెయిటేజీలో అత్యధిక వాటా ఉన్న రిలయన్స్ లాభాలు సూచీలను గణనీయంగా పైకి లేపాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకింగ్ రంగ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరగడం కూడా సూచీల ర్యాలీకి మరో ప్రధాన కారణం. దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగం వెన్నెముకలా నిలవడంతో మదుపర్లు ఈ రంగంపై నమ్మకం ఉంచారు. గత కొన్ని రోజులుగా విదేశీ సంస్థాగత మదుపర్లు భారత ఈక్విటీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇది దేశీయ మార్కెట్లకు గణనీయమైన మద్దతునిచ్చింది. గత 8 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్ఐఐలు సుమారు రూ.32 వేల కోట్లకు పైగా విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడం భారత మార్కెట్లపై వారి విశ్వాసాన్ని చాటి చెబుతోంది. అంతర్జాతీయంగా కూడా కొన్ని అనుకూల పరిణామాలు మార్కెట్లకు బలం చేకూర్చాయి. ముఖ్యంగా, అమెరికా, చైనాల మధ్య టారిఫ్ల వివాదం పరిష్కారమై త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో సానుకూలతను నింపాయి. ఇది భారత మార్కెట్లకు కూడా విస్తరించింది. డాలర్తో రూపాయి మారకం విలువ బలపడటం (37 పైసలు బలపడి 85.04 వద్ద స్థిరపడింది), అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు 66-67 డాలర్ల మధ్య సాపేక్షికంగా స్థిరంగా కొనసాగడం వంటి అంశాలు భారత మార్కెట్లకు అనుకూలంగా మారాయి. సాధారణంగా దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగితే మార్కెట్లు ఆందోళనకు గురవుతాయి. కశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి ఘటనతో భారత్-పాకిస్తాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, సోమవారం మార్కెట్లు వాటిని పెద్దగా పట్టించుకోనట్లుగా సానుకూల వార్తల వెంట పయనించాయి. బలమైన దేశీయ ఆర్థిక సూచికలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం ముందు భౌగోళిక ఉద్రిక్తతల భయాలు చిన్నబోయాయి.
లాభాల బాటలో సెన్సెక్స్ సూచీలు !
April 28, 2025
0
Tags