రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కితాబు ఇచ్చారు. ఇదే సమయంలో భారత్ స్టాండ్ను తప్పుగా తీసుకుని విమర్శించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, తప్పులో కాలేసి ఇప్పుడు తన ముఖంపై గుడ్డుతో కొట్టించుకున్నంత పనిచేసినట్టు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..'రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో భారత్ వైఖరిని విమర్శించి నేను ఒక మూర్ఖుడిలా మిగిలిపోయాను. కానీ, భారత ప్రధాని రెండు వారాల వ్యవధిలో ఆ రెండు దేశాల అధినేతలను ఆలింగనం చేసుకొని వారి ఆమోదం పొందారు. చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే శాశ్వత శాంతి తీసుకొచ్చే స్థితిలో ప్రస్తుతం భారత్ ఉంది. యూరప్ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవడం వల్ల భారత్ ఎన్నో ప్రయోజనాలు పొందుతోందని అన్నారు. ఇదే సమయంలో 2003లో భారత్.. ఇరాక్కు దళాలను పంపాలని అభ్యర్థించినప్పుడు ప్రతిఘటన ఎదురైంది. అమెరికా దాడి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ భారత శాంతి పరిరక్షక దళాలు ఇరాక్కు వెళ్లవని పేర్కొంటూ పార్లమెంటు సమావేశమై ఒక తీర్మానాన్ని ఆమోదించిందని తెలిపారు. కానీ, ఉక్రెయిన్ విషయంలో అలా జరగడం నాకు కనిపించలేదన్నారు. శాంతి కోసమే భారత్ కచ్చితమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇక, ప్రస్తుతానికి తాను ప్రతిపక్షంలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను అంటూ వ్యాఖ్యలు చేశారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంది : శశిథరూర్
March 19, 2025
0
Tags