ఈస్ట్‌ ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు ?

Telugu Lo Computer
0

                                           

ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనేఉన్నాయి. శుక్రవారం ఉదయం ఈస్ట్‌ ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్‌ ద్వారా వార్నింగ్‌ రావడంతో ముందుజాగ్రత్తగా స్కూళ్లను మూసివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్‌ సిబ్బంది స్కూళ్లలో తనిఖీలు చేశారు. అనంతరం అనుమానాస్పద వస్తువులేవీ లేవని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మయూర్‌ విహార్‌లోని అహ్లాకాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు ప్రిన్సిపల్‌ పాండవ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు టెలిఫోన్‌ ద్వారా తెలియజేశారని వెల్లడించారు. అదే విధంగా నోయిదాలోని శివ్‌ నాడార్‌ స్కూల్‌కు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. బాంబ్‌ స్క్వాడ్‌, ఫైర్‌ సిబ్బంది, డాగ్‌ స్క్వాడ్‌ స్కూల్‌లో తనిఖీలు చేస్తున్నారని వెల్లడించారు. మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై సైబర్‌ టీమ్‌ దర్యాప్తు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి గాలివార్తలను నమ్మొద్దని నోయిడా పోలీసులు సూచించారు. గతకొన్ని రోజులుగా ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారిన విషయం తెలిసిందే. కాగా, గత నెల 10న స్కూళ్లకు బెదింపుల వెనక ఉన్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఓ మైనర్ విద్యార్థి.. తన స్కూల్ పరీక్షలను తప్పించుకునేందుకు ఆ బెదిరింపులు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనలో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కస్టడీలోకి తీసుకున్నారు. దాదాపు ఆరుసార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ చేశాడు ఆ స్టూడెంట్. అయితే ప్రతిసారి తన స్వంత స్కూల్ కాకుండా.. మిగితా స్కూళ్ల పేరు మీద అతను బెదిరింపు మెయిల్స్ చేసేవాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అతను ఆ ప్లాన్ చేశాడు. ప్రతిసారి అతను తన మెయిల్‌లో.. ఒకేసారి పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ చేసేవాడు. ఓ సారి ఏకంగా అతను 23 స్కూళ్లకు ఒకేసారి మెయిల్ చేశాడు.స్కూల్‌లో పరీక్షకు హాజరు కావాలన్న ఉద్దేశం లేకపోవడంతో ఆ మైనర్ విద్యార్థి బాంబు బెదిరింపు మెయిల్స్ చేసినట్లు అధికారులు చెప్పారు. ఆ బెదిరింపుల వల్ల ఎగ్జామ్స్ రద్దు అవుతాయన్న ఉద్దేశంతో అతను అలా చేసినట్లు పసికట్టారు. డజన్ల సంఖ్యలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు రావడంతో.కొన్ని వారాల పాటు ఢిల్లీ అధికారులు టెన్షన్ ఫీలయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)