భారత రాష్ట్ర సమితి పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ రజతోత్సవ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సిద్ధమైంది.ఈ మేరకు పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గం ఈ నెల 19న సమావేశం కావాలని అధినేత కేసీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 19న తెలంగాణభవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిలు పాల్గొననున్నారు. ''రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా భారాస శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర చర్చ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన, హక్కులను కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై సమావేశంలో చర్చిస్తాం''అని కేటీఆర్ తెలిపారు.
ఫిబ్రవరి 19న తెలంగాణభవన్లో భారాస విస్తృతస్థాయి సమావేశం
February 13, 2025
0
Tags