మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దాబ్రాకు చెందిన జ్యుయలరీ వ్యాపారి విజయ్ అగర్వాల్ భార్య కుకి అగర్వాల్ బుధవారం గుడికి వెళ్లింది. అయితే ఆలయం సమీపంలో నివసించే లీలా శర్మ, తన ఇద్దరు కుమార్తెలు గౌరి, నేహాతో కలిసి కుకి అగర్వాల్పై రాళ్లు రువ్వారు. గాయపడిన ఆమె దీని గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసి విజయ్ అగర్వాల్ జ్యుయలరీ షాపులోని సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. యజమాని భార్యపై రాళ్లు విసిరిన లీలాను కింద పడేసి తన్నారు. ఆమె కుమార్తెను స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. తల్లీ, కుమార్తెను కాపాడి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు. మహిళలపై దాడికి సంబంధించి జ్యుయలరీ షాపు యజమాని విజయ్ అగర్వాల్, ఆయన భార్య, 15 మంది సిబ్బందిపై కేసు నమోదు చేశారు. నలుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. కాగా, జనవరి 16న కూడా లీల, ఆమె కుమార్తె కలిసి ఒక వ్యక్తిపై రాళ్లు విసిరినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ మహిళలను దారుణంగా కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మధ్యప్రదేశ్లో అమానుష్య ఘటన : మీడియాలో వీడియో వైరల్
January 22, 2025
0
Tags