హైదరాబాద్లోని వనస్థలిపురం పీఎస్ పరిధిలోని హరిణి నేషనల్ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అటవీ, పోలీస్ శాఖ ఆధీనంలో ఆటోనగర్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. అయితే, మన్సూరాబాద్ సర్వే నెంబర్ ఏడులో ఉన్న 682 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ తన తల్లిపేరు మీద ఉందని చెప్పి 50 వేల మందికి నోటరీ చేశారు యూసఫ్ ఖాన్ అనే వ్యక్తి, అతని భార్య తులసమ్మలు. ఈ రోజు నోటరీ చేసిన బాధితులకు ప్లాట్లు ఇస్తానని చెప్పడంతో భారీ సంఖ్యలో బాధితులు చేరుకున్నారు. బాధితుల రాకతో అప్రమత్తమైన పోలీసులు సుమారు 500 మందికి పైగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే బాధితుల్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు ముఠాగా ఏర్పడి 587 ఎకరాల ఫారెస్ట్ భూమిని ప్లాట్లుగా చేసి అమ్మారు. 100 గజాలు రూ. 40 నుంచి 50వేల రూపాయలకే ముఠా అమ్మగా, ఆ భూమిని సుమారు 50 వేల మంది కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. భూదందాను అడ్వకేట్ షేక్ జిలానీ ద్వారా యూసఫ్ ఖాన్, తులసమ్మలు తతంగం నడిపించారు. అయితే, ఇవాళ కొన్నవాళ్లకు ఫ్లాట్స్ ఇస్తానని చెప్పి సర్వే నెంబర్ 7 దగ్గరకు రావాలని అడ్వకేట్ జిలానీ కొనుగోలు దారుల్ని నమ్మించారు. ల్యాండ్ మాఫియా మోసంపై సమాచారం అందుకున్న పోలీసులు ఫారెస్ట్ భూమి చుట్టూ మోహరించారు. ప్లాట్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలుదారులు సర్వే నెంబర్ ఏడు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించడంతో అనుమానం వ్యక్తం చేసిన కొనుగోలుదారులు అసలు విషయం తెలిసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఫారెస్ట్ భూమిని ప్లాట్లుగా చేసి అమ్మిన ఘరానా మోసగాళ్లు !
January 26, 2025
0
Tags