చదరపు గజం రూ.1.85 లక్షలు పలికిన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు ప్లాట్లు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పశ్చిమ డివిజన్ పరిధిలోని ఖాళీ ప్లాట్ల తెలంగాణ హౌసింగ్ బోర్డు వేలం వేసింది. చదరపు గజం అత్యధికంగా రూ.1.85 లక్షలు పలికింది. అత్యల్పంగా రూ.1.50 లక్షలు పలికింది. ఇక్కడి 24 ఖాళీ స్థలాలకు గాను 23 స్థలాలకు వేలంపాట ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని ఖాళీ ప్లాట్ల వేలంపాట వ్యవహారంపై హైకోర్టులో శుక్రవారం నాడు విచారణ జరిగింది. ఫేజ్ 15 కాలనీ వాసులు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. 54.29 ఎకరాల స్థలంలో లేఔట్ ఉందని, అందులో 10 శాతం గ్రీనరీ కోసం వదిలేయాలని, కానీ గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారా? అని కోర్టు ప్రశ్నించింది. అయితే 10 శాతం స్థలాన్ని ఇప్పటికే జీహెచ్ఎంసీకి అప్పగించినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. లేఔట్లో గ్రీనరీ కోసం కేటాయించిన 10 శాతం భూమి వివరాలను ఇవ్వాలని ఏజీని కోర్టు ఆదేశించింది. తుది కేటాయింపులు చేయకూడదనే షరతుతో వేలంపాటను కొనసాగించవచ్చని తెలిపింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)