ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన !

Telugu Lo Computer
0


యిరిండియా సంస్థలో కొన్ని విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా సిబ్బంది మూకుమ్మడి సిక్ లీవ్ పెట్టడంతో పలు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌  విమానాలు రద్దయిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి నుంచి దాదాపు 80 విమానసేవలు నిలిచిపోయినట్లు సమాచారం. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఢిల్లీ, కొచ్చి, కొయ్‌కోడ్‌, తిరువనంతపురం సహా పలు నగరాల్లో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. గల్ప్‌ దేశాలకు విమానం ఎక్కేందుకు ఎయిర్‌పోర్టులో వేచి చూస్తోన్న తరుణంలో రద్దు గురించి తమకు సమాచారం ఇచ్చారని ఓ ప్రయాణికుడు ఆసహనం వ్యక్తం చేశారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే రీఫండ్‌ ఇస్తామని, ఫ్లైట్ రీ షెడ్యూల్ చేస్తామని ప్రకటించింది. కానీ ప్రయాణికులు మాత్రం తక్షణమే రీఫండ్, అదే రోజు రీ షెడ్యూల్‌ కోసం డిమాండ్ చేస్తున్నారు. వర్క్‌ వీసాలు గడువు ముగిసిపోనుండటంతో.. ఈ ఆలస్యం వల్ల తాము ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తలెత్తుందని మరికొందరు ఆందోళనపడుతున్నారు. ''నేను మే 10కి వెళ్తే ఉపయోగం ఏముంది..? మే9లోపు వెళ్లకపోతే.. నా ఉద్యోగం ఉండదు'' అని ఓ మహిళ మీడియాకు వెల్లడించారు. అలాగే ఎయిర్‌పోర్టుల్లో తమకు ఎలాంటి వసతి కల్పించలేదని కొందరు ఆరోపించారు. మరికొందరు కౌంటర్ల వద్దకు దూసుకొచ్చి తమ అసహనాన్ని వెళ్లగక్కారు. ఆకస్మాత్తుగా విమానాలు రద్దు కావడంపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ క్షమాపణలు చెప్పింది. ఏడు రోజుల్లోగా ప్రయాణాన్ని రీషెడ్యూల్‌ చేసుకోవచ్చని సూచించింది. లేదా రిఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ప్రస్తుతం సెలవులో ఉన్న తమ సిబ్బందితో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)