తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు అందింది. ఇటీవల రాష్ట్రంలో వడగళ్ల వానలకు దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు సర్కారు సిద్ధమైంది. రెవెన్యూ శాఖ సహజ ప్రకృతి విపత్తుల నిర్వహణ కింద 15 కోట్ల 81 లక్షల 41 వేల రూపాయలను రైతులకు పరిహారంగా మంజూరు చేస్తూ ఆర్థికపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు కురిసిన వడగండ్ల వర్షాల ప్రభావంతో కామారెడ్డి, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సంగారెడ్డి తదితర పది జిల్లాల్లో పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగింది. క్షేత్రస్థాయిలో సర్వే చేసిన అనంతరం 15, 814.03 ఎకరాల విస్తీర్ణంలో వివిధ వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వ హామీ మేరకు 15 కోట్ల 81 లక్షల 40 వేల రూపాయలు రైతులకు పంట నష్టపరిహారం కింద చెల్లించాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆగిపోయింది. అయితే, రైతుల ఇబ్బందులు పరిగణలోకి తీసుకుని ఆ మొత్తం విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో నష్టపరిహారం మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో, సోమవారం లేదా మంగళవారం లోపు పూర్తి స్థాయిలో జమ చేయడానికి సంబంధిత అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబరుతో లింకేజీ లేకపోతే తక్షణమే బ్యాంకు వెళ్లి రైతులు అనుసంధానం చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.
తెలంగాణలో పంట నష్టం నిధులు విడుదల ?
May 06, 2024
0
Tags