ఆయుధాలు అప్పగించేదే లేదని ఆర్మీని అడ్డుకున్న మహిళలు !

Telugu Lo Computer
0

                    
ణిపూర్‌ లో స్థానికుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను తరలించేందుకు ప్రయత్నించిన సైన్యాన్ని వందలాది మంది మహిళలు అడ్డుకోవడంతో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపినా ఫలితం లేకపోయింది. అధికారుల వివరాల ప్రకారం... బిష్ణుపుర్‌ జిల్లాలోని కుంభీ ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది.. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో కూడిన రెండు వాహనాలను అడ్డుకున్నారు. ఇది గమనించిన వాహనాల్లోని వారు వాటిని అక్కడే వదిలేసి పరారయ్యారు. కొద్దిసేపటికే మీరా పైబీ బృందానికి చెందిన వందలమంది మహిళలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఆయుధ సామగ్రి తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. గత ఏడాది మేలో మొదలైన అల్లర్లు ముగిసేవరకు ఎలాంటి ఆయుధాలు జప్తు చేయొద్దన్నారు. ఈక్రమంలో రోడ్డును దిగ్బంధించి ఆర్మీ కాన్వాయ్‌ను కదలనీయకుండా అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు బలగాలు గాల్లో కాల్పులు జరిపినా ఫలితం లేకపోయింది. ఈమేరకు సమాచారం అందుకున్న రాష్ట్ర పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ ఆయుధాలను పోలీసులకు అప్పగిస్తామని సైనిక సిబ్బంది చెప్పడంతో మహిళలు శాంతించారు. ''కుంభీ వంటి సరిహద్దు ప్రాంతంలో కాపలాగా ఉన్న గ్రామ వాలంటీర్ల వద్ద నుంచి ఆయుధాలను జప్తు చేయడం వల్ల.. చురాచాంద్‌పుర్ జిల్లా పక్కనే ఉన్న కొండ ప్రాంతాల నుంచి సాయుధ మిలిటెంట్లు దాడులు చేసే అవకాశం ఉంది'' అని మహిళా నిరసనకారుల నాయకురాలు జయ ఖగెన్‌బామ్ తెలిపారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొందని, సైనిక సిబ్బంది ఘటనా స్థలం నుంచి వెనుదిరిగారని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)