ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ ఆమోదం కోసం ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. మంగళవారం ఈ బిల్లును సీఎం పుష్కర్సింగ్ ధామీ సభలో ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన వాటితోపాటు సహ జీవనానికి రిజిస్ట్రేషన్ వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని విపక్షాలు సూచించినా.. అధికార పార్టీ మాత్రం తన పంతం నెగ్గించుకుంది. ఒకసారి గవర్నర్ ఆమోదం పొందితే అది చట్టంగా మారనుంది. బిల్లు ఆమోదం పొందిన అనంతరం సీఎం పుష్కర్సింగ్ ధామీ మీడియాతో మాట్లాడారు. ''ఉత్తరాఖండ్ చరిత్రలో ఇదొక మరిచిపోలేని రోజు. యూసీసీ అమలుకు దేశవ్యాప్తంగా ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నాయి. అలాంటి ఈ బిల్లును తొలుత ఉత్తరాఖండ్ తీసుకొచ్చింది. దీనికి సహకరించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ బిల్లు ఏ ఒక్కరికీ వ్యతిరేకంగా తీసుకొచ్చింది కాదు. దీనివల్ల ముఖ్యంగా మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది. వివాహం, విడాకులు వంటి విషయాల్లో మహిళలపై ఉన్న వివక్షను ఈ బిల్లు తొలగిస్తుంది'' అని ఆయన పేర్కొన్నారు.
యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం
February 07, 2024
0
Tags