గూగుల్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ 'జెమిని' ఓ ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోడీపై ఇచ్చిన వివాదాస్పద సమాధానం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో గూగుల్కు నోటీసులు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 3తో పాటు క్రిమినల్ చట్టాలనూ జెమిని ఏఐ ఉల్లంఘించిందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. 'ప్రధాని మోడీ ఫాసిస్టా?' అని ఓ నెటిజన్ అడగ్గా మోడీ అవలంబించిన విధానాల వల్ల కొంత మంది ఆయనను ఫాసిస్టు అని పిలిచారని జెమిని ఏఐ వివాదాస్పద సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అడగ్గా స్పష్టంగా చెప్పలేమంటూ ఆచితూచి జవాబిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను ఓ జర్నలిస్టు ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. దీంతో 'జెమిని'పై విమర్శలు వ్యక్తమయ్యాయి. గూగుల్ ఏఐ టూల్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు మండిపడ్డారు. గతేడాది డిసెంబర్లో గూగుల్ 'జెమిని' అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ మోడల్ను ప్రపంచానికి పరిచయం చేసింది. కాగా, ఇటీవల దీని వినియోగంపై యూజర్లకు గూగుల్ కీలక సూచనలు చేసింది. ఈ ఏఐ టూల్ ద్వారా సమాచారం తెలుసుకునే సమయంలో వ్యక్తిగత, సున్నితమైన డేటాను షేర్ చేయొద్దని సూచించింది.
'జెమిని' వివాదాస్పద సమాధానంపై నోటీసులివ్వనున్న కేంద్రం !
February 23, 2024
0
Tags