రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండు రోజుల విరామం అనంతరం పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లా నుంచి తిరిగి మొదలైంది. బెంగాల్ పిసిసి అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరితో కలసి ఒక ఎస్యువి టాప్పై కూర్చొని రాహుల్ గాంధీ జల్పాయిగురి పట్టణ వీధులలో సాగారు. రోడ్డుకు రెండు వైపుల చేరిన జన సందోహాన్ని ఉద్దేశించి రాహుల్ చేతులు ఊపారు. యాత్ర ఆదివారం రాత్రి సిలిగురి సమీపంలో ఆగుతుందని బెంగాల్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు తెలిపారు. సోమవారం యాత్ర ఉత్తర దినాజ్పూర్ జిల్లా దిశగా సాగి బీహార్లోకి ప్రవేశిస్తుందని ఆయన తెలియజేశారు. ఆదివారం ఉదయం సిలిగురిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో రాహుల్కు అధీర్ రంజన్ స్వాగతం పలికారు. యాత్ర ఈ నెల 31న తిరిగి పశ్చిమ బెంగాల్లోకి మాల్డా మీదుగా ప్రవేశించి ముర్షిదాబాద్ మీదుగాసాగుతుంది. యాత్ర ఫిబ్రవరి 1న బెంగాల్ను వీడుతుంది. బెంగాల్లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సాఫీగా సాగేలా చూడవలసిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే లేఖ రాశారు. రాహుల్ గాంధీ చిత్రంతో కూడిన పార్టీ బ్యానర్లు కొన్నిటిని జల్పాయిగురిలో ధ్వంసం చేశారని కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు ఆరోపించింది.
బెంగాల్లో తిరిగి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర !
January 28, 2024
0
Tags