ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ 'నిలవు కుడిచ సింహంగళ్' (వెన్నెల తాగుతున్న సింహం) పేరిట తన ఆత్మకథ రాసుకున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది మార్కెట్లో విడుదల కానుంది. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన తాను జీవితంలో ఎలా పురోగమించిందీ సోమనాథ్ ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. ఉద్యోగ జీవితంలో తనకు ఎదురైన సవాళ్లను కూడా ఆయన పుస్తకంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇస్రో మాజీ చీఫ్ కే శివన్ను, ఎస్.సోమనాథ్ తన పుస్తకంలో టార్గెట్ చేశారన్న ప్రచారం అకస్మాత్తుగా మొదలవడంతో ఆయన ఈ విషయమై తాజాగా స్పష్టతనిచ్చారు. ఏ సంస్థలోనైనా ఉన్నత స్థానానికి చేరుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ సవాళ్లు ఎదుర్కొంటారని తెలిపారు. తనకూ అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ''అయితే, నేను ఎవర్నీ ప్రత్యేకంగా టార్గెట్ చేసుకోలేదు. కీలక స్థానాల్లో ఉన్న వారు సాధారణంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక పోస్టుకు ఒకరి కంటే ఎక్కువ మంది అర్హులు ఉండొచ్చు. ఈ అంశాన్నే నేను వెలికితీసే ప్రయత్నం చేశాను. అంతేకానీ, ఎవరినీ టార్గెట్ చేయలేదు'' అని అన్నారు. అయితే, చంద్రయాన్-2 వైఫల్యానికి సంబంధించి చేసిన ప్రకటనలో కొంత స్పష్టత లోపించిందని ఇస్రో చీఫ్ వ్యాఖ్యానించారు. కమ్యూనికేషన్ వైఫల్యం ఉందని, అది క్రాష్ ల్యాండ్ అవుతుందని స్పష్టంగా ప్రకటించలేదని వెల్లడించారు. ''అసలేం జరిగిందో స్పష్టంగా చెప్పడమనేది నా దృష్టిలో మంచి పద్ధతి. ఇది సంస్థలో పారదర్శకత పెంచుతుంది. కాబట్టి, నేను ఈ అంశాన్ని పుస్తకంలో ప్రస్తావించాను'' అని ఇస్రో చీఫ్ సోమనాథ్ పేర్కొన్నారు. సవాళ్లను స్వీకరిస్తూ అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు వెళ్లేలా ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకే తాను ఈ పుస్తకం రాశానని ఆయన స్పష్టం చేశారు.
తాను ఎవర్నీ టార్గెట్ చేయలేదు !
November 04, 2023
0
Tags