అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్పతి'లో 14 ఏళ్ల బాలుడు సంచలనం సృష్టించాడు. ఏకంగా రూ.కోటి గెలుచుకుని రికార్డు సృష్టించాడు. కేబీసీ జూనియర్స్ స్పెషల్లో భాగంగా హర్యానా లోని మహేంద్రగఢ్కు చెందిన మయాంక్ 8వ తరగతి చదువుతున్నాడు. తాజాగా మంగళవారం జరిగిన ఎపిసోడ్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ.కోటిని సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆ బాలుడిపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. షో మొదలైన తర్వాత మయాంక్ ఒక లైఫ్ లైన్ కూడా వాడకుండా రూ.3.2లక్షల వరకూ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు. రూ.12.5లక్షల ప్రశ్నకు ఒక లైఫ్ లైన్ వాడుకున్నాడు. ఇక రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పిన అనంతరం మాయంక్ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో షో చూస్తున్న వారంతా కూడా భావోద్వేగానికి గురయ్యారు. 'స్లమ్ డాగ్ మిలియనీర్'లో సన్నివేశాన్ని తలపించేలా ఈ ఎపిసోడ్ అనుభూతిని పంచింది. 'కొత్తగా కొనుగొన్న ఖండానికి అమెరికా అని పేరు పెట్టి దాని మ్యాప్ను తయారు చేసిన యూరోపియన్ క్యాట్రోగ్రాఫర్ ఎవరు?' అని రూ.కోటి ప్రశ్న అడిగిన అమితాబ్ అందుకు సమాధానాలుగా A.అబ్రహాం ఓర్టెలియస్, B.గెరాడస్ మెరేక్టర్, C.జియోవన్నీ బాటిస్టా అగ్నెస్, D.మార్టిన్వాల్డీ ముల్లర్ అంటూ ఆప్షన్స్ ఇచ్చారు. దీంతో మయాంక్.. D.మార్టిన్ వాల్డీముల్లర్ ఆప్షన్ ఎంచుకుని రూ.కోటిని సొంతం చేసుకున్న తొలి జూనియర్ కంటెస్టెంట్గా నిలిచాడు. అనంతరం రూ.7 కోట్ల ప్రశ్నను ప్రయత్నించి షో నుంచి క్విట్ అయ్యాడు.
కౌన్బనేగా కరోడ్పతిలో రూ.కోటి గెలుచుకున్న 14 ఏళ్ల బాలుడు !
November 29, 2023
0
Tags