హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అస్వస్థతకు గురైయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్కు తీసుకెళ్లినట్లు ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ వెల్లడించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, అన్ని నివేదికలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. 'బుధవారం రాత్రి నుంచి అన్ని రకాల పరీక్షలు చేశాం. కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు బయటపడింది. మరిన్ని వైద్యపరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించాం' అని తెలిపారు. సిమ్లాలో సీఎంను పరీక్షించిన వైద్యబృందం కూడా ఆయన వెంట వెళ్లింది. బుధవారం రాత్రి సుఖ్విందర్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. పొత్తికడుపులో నొప్పితో ఆసుపత్రిలో చేరారు. 'గత కొద్దిరోజులుగా సీఎం విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్నిసార్లు బయట ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. దానివల్లే ఆయన ఇన్ఫెక్షన్కు గురయ్యారు' అని సుఖు ప్రధాన మీడియా సలహాదారు వెల్లడించారు.
సుఖ్విందర్ సింగ్ సుఖుకు అస్వస్థత
October 27, 2023
0
Tags