రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకే ప్రధాని సహా బీజేపీ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని, రాజస్ధాన్ అభివృద్ధికి వారు చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. ప్రధాని పర్యటన కేవలం రాజకీయపరమైనదేనని, పాలనాపరంగా ఎలాంటి ప్రాధాన్యత లేదని ఆయన సోమవారం అన్నారు. రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని, బీజేపీ నేతల వరుస పర్యటనల ఉద్దేశాన్ని ప్రజలు అర్ధం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. 8 కోట్ల రాజస్ధాన్ ప్రజల ఆకాంక్షలు కాషాయ నేతలకు పట్టవని, వారు కేవలం ఎన్నికల ప్రచారం కోసమే రాష్ట్రానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజస్ధాన్లో బీజేపీ నేతలు ప్రజలను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతోనే ఆ పార్టీ జాతీయ నేతలు పర్యటిస్తున్నారని అన్నారు. రాజస్ధాన్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాజస్ధాన్లోని చిత్తోర్ఘఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో దళితులు, మహిళలపై వేధింపులు పెరగడంతో ప్రజలు కాషాయ పార్టీకి పట్టం కట్టాలని భావిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు భద్రత ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని పర్యటనలు !
October 02, 2023
0
Tags