పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పుల విషయంలో కీలక సిఫార్సులతో ఎన్సీఈఆర్టీ కమిటీ ముందుకొచ్చింది. అన్ని పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో 'భారత్'ను చేర్చాలని సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈమేరకు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. దీంతోపాటు పుస్తకాల్లో 'ప్రాచీన చరిత్ర'కు బదులుగా 'సంప్రదాయిక చరిత్ర'ను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసినట్లు కమిటీ ఛైర్మన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యుడు సీఐ ఐజాక్ తెలిపారు. అన్ని సబ్జెక్టుల సిలబస్లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టాలని కూడా సిఫార్సు చేసింది. అయితే.. ఈ కమిటీ చేసిన సిఫార్సులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ అధికారులు తెలిపారు. ప్యానెల్ సిఫార్సులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ ఛైర్మన్ దినేష్ సక్లానీ స్పష్టంచేశారు. పాఠ్యపుస్తకాల్లో ఇండియా బదులు 'భారత్' పేరును ఉపయోగించాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్లు సీఐ ఐజాక్ చెప్పినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. వివిధ యుద్ధాల్లో హిందూ పాలకులు సాధించిన విజయాలనూ ప్రముఖంగా పేర్కొనాలని కూడా కమిటీ ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. 'ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో మన వైఫల్యాల గురించి ఉన్నాయి. కానీ, మొఘలులు, సుల్తానులపై సాధించిన విజయాల గురించి లేవు' అని ఐజాక్ అన్నారు. ఈ కమిటీలో ఐసీహెచ్ఆర్ ఛైర్పర్సన్ రఘువేంద్ర తన్వర్, జేఎన్యూ ప్రొఫెసర్ వందనా మిశ్రా, డెక్కన్ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీ మాజీ వీసీ వసంత్ శిందే, హరియాణా ప్రభుత్వ పాఠశాలలో సామాజిక శాస్త్రాన్ని బోధిస్తున్న మమతా యాదవ్లూ ఉన్నారు. అయితే, మీడియా కథనాలపై పాఠ్యపుస్తకాలు, కొత్త సిలబస్ రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోందని, దీనిపై ఇప్పుడే స్పందించడం తొందరపాటే అవుతుందని ఎన్సీఈఆర్టీ పేర్కొంది.
పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో 'భారత్' ?
October 25, 2023
0
Tags