'ఇస్కాన్' పై మేనకా గాంధీ ఆరోపణలు

Telugu Lo Computer
0


'ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్ నెస్‌'పై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. '' ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న ఇస్కాన్ గోశాలలలోని ఆవులను కసాయిలకు అమ్ముకుంటోంది. అది దేశంలోనే అతిపెద్ద మోసకారి'' అని ఆమె విమర్శించారు. ''ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఉన్న గోశాలను సందర్శించాను. అక్కడ పాలు ఇచ్చే ఆవు ఒక్కటి కూడా లేదు. దూడలు కూడా లేవు. మొత్తం డెయిరిలో ఒక్కటి కూడా పాలిచ్చే ఆవు లేదు. అంటే అక్కడ ఉన్న ఆవుల్ని అమ్ముకున్నారని తెలుస్తోంది. ఆవుల్ని అమ్ముకుంటున్న ఇస్కాన్ రోడ్డు మీద మాత్రం హరే రామ హరే కృష్ణ అని అంటోంది'' అని మేనకాగాంధీ ఆరోపించారు. ఈమేరకు ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ అభియోగాలను ఇస్కాన్ ఖండించింది. మేనకా గాంధీ ఆరోపణలు నిరాధారమైనవని, అవన్నీ తప్పుడు ఆరోపణలని స్పష్టం చేసింది. గోసంరక్షణకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుదిష్టర్ గోవింద దాస్‌ వెల్లడించారు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తాము గో సంరక్షణ కోసం గోశాలల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోవులకు తాము జీవితాలను ప్రసాదిస్తున్నామని, వాటిని కసాయిలకు అమ్మడం లేదని ఇస్కాన్ తేల్చి చెప్పింది. ఇస్కాన్ ప్రతినిధి తన ట్విట్టర్ అకౌంట్ లో ఈమేరకు వివరణతో ఒక పోస్ట్ పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)