ఒక్కో ఎలుకను పట్టడానికి రూ.41 వేలు !

Telugu Lo Computer
0


నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ ఎలుకలను పట్టుకోవడంలో ఘనత సాధించింది. ఇక వారు సాధించిన ఘనత సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి రైల్వే శాఖ ఎలుకలను పట్టుకోవడానికి ఎంత ఖర్చు చేస్తుందో లెక్క అడిగినప్పుడు తెలియజేసింది. నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ 2020 నుంచి 2022 వరకు ఎలుకలను పట్టుకోవడం కోసం ఏకంగా 69.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇంతకీ వారు ఎన్ని ఎలుకలు పట్టుకున్నారు అన్న లెక్క తెలిస్తే కచ్చితంగా అవాక్కవుతాం. 2020 నుండి 2022 వరకు వారు 168 ఎలుకలు పట్టుకున్నట్టు గణాంకాలలో వెల్లడించారు. నార్తన్ రైల్వే పరిధిలో ఢిల్లీ, అంబాల, లక్నో, ఫిరోజ్ పూర్, మొరాదాబాద్ డివిజన్ లు ఉన్నాయి. చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి రైల్వే వ్యాప్తంగా సమాచారం కోరితే ఒక్క లక్నో డివిజన్ మాత్రమే స్పష్టమైన సమాచారం ఇచ్చింది. అయితే ఎలుకల కారణంగా ఎంత మేరకు నష్టం జరిగింది అన్నదానికి మాత్రం సమాధానం ఇవ్వలేదు. ఎలుకలను పట్టుకోవడం కోసం ఎంత ఖర్చు చేశారు అనేది మాత్రం లెక్క చెప్పింది. ఒక్కో ఎలుకకు ఏకంగా 41 వేల రూపాయలు ఖర్చు చేసి అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఇక అంబాల డివిజన్ విషయానికి వస్తే 2020 ఏప్రిల్ నుండి 2023 మార్చి వరకు ఎలుకలు, చెదల నివారణకు 39.3 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఏదిఏమైనా ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి 41 వేల రూపాయలు ఖర్చు చేశారంటే మన రైల్వే అధికారుల పనితనం ఏ పాటితో, చేతివాటం ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)