జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో కలిసి భారత్లోనే ఎఫ్414 ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేయాలన్న ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్ ఆమోదముద్ర వేసింది. ఈ ఇంజిన్లను భారత వాయుసేన కోసం వినియోగించనున్నారు. జూన్లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ డీల్పై సంతకాలు జరిగాయి. తాజాగా ఆ ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ కూడా ఆమోదముద్ర వేసింది. దీంతో అమెరికాకు చెందిన అత్యున్నత శ్రేణి జెట్ ఇంజిన్లను భారత్లోనే తయారు చేయడానికి మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం కింద దాదాపు 80శాతం టెక్నాలజీని జీఈ భారత్కు బదలాయిస్తుంది. దీంతో భారత వాయుసేన ఉపయోగించే తేజస్ ఎంకే2కు అవసరమైన ఇంజిన్ల తయారీ సులువవుతుంది. ఈ భాగస్వామ్యం ఓ పెనుమార్పునకు నాంది పలుకుతుందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సీబీ అనంత కృష్ణన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దేశీయంగానే తయారు చేసిన విమాన ఇంజిన్లను మన జెట్లకు అందించేందుకు ఇది పునాది వేస్తుందని వివరించారు. ఈ కొత్త ఒప్పందం ప్రకారం 99 ఇంజిన్లను జీఈ-హల్ సంయుక్తంగా నిర్మించాల్సి ఉంటుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కారణంగా వీటిని అతి తక్కువ ధరలోనే నిర్మించడం సాధ్యమవుతుంది. ఎఫ్414 ఇంజిన్ను ఇప్పటి వరకు ప్రపంచంలోని పలు అత్యుత్తమ ఫైటర్జెట్లు వినియోగించాయి.
భారత్లో జీఈ విమాన ఇంజిన్ల తయారీకి అమెరికా కాంగ్రెస్ ఆమోదముద్ర !
August 31, 2023
0
Tags