రెండు దశల్లో సుప్రీంకోర్టు విస్తరణ !

Telugu Lo Computer
0


సుప్రీంకోర్టును విస్తరణ చేపట్టే యోచనలో ఉన్నట్లు మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల సందర్భంగా మంగళవారం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు విస్తరణ ప్రణాళిక గురించి వివరించారు. సుప్రీంకోర్టులో 27 అదనపు కోర్టులు, జడ్జీల సంఖ్యను 51కి పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 16 కోర్టులు, 2 రిజిస్టార్‌ కోర్టులు ఉన్నాయి. మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32గా ఉంది. న్యాయస్థానాన్ని ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మరియు అందరినీ కలుపుకుపోయేందుకు ప్రాధాన్యతా ప్రాతిపదికన అత్యున్నత న్యాయస్థాన మౌలిక సదుపాయాల విస్తరణ అత్యవసరమని అన్నారు. న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల ఆధునీకరణలో భాగంగా ఈ ప్రాజెక్టు ఉండనుందని అన్నారు. 27 అదనపు కోర్టులు, 51 జడ్జీల చాంబర్స్‌, 4 రిజిస్ట్రార్‌ కోర్టు రూమ్స్‌, 16 రిజిస్ట్రార్‌ చాంబర్స్‌, న్యాయవాదుల, పిటిషన్‌దారుల కోసం అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించడానికి నూతన భవనాన్ని నిర్మించడం ద్వారా సుప్రీంకోర్టును విస్తరించాలని తాము ప్లాన్‌ చేస్తున్నామని అన్నారు. ఈ విస్తరణ రెండు దశల్లో జరగనుందని చెప్పారు. 9,000కు పైగా తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించినట్లు సిజెఐ చెప్పారు. 9,423 తీర్పులను అస్సాం, బెంగాలీ, గారో, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠి, నేపాలీ, తమిళ్‌, బెంగాలీ, తెలుగు, ఉర్దూలతో పాటు పలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించినట్లు తెలిపారు. 8,977 తీర్పులను హిందీలోకి అనువదించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రారంభమైనప్పటి నుండి వచ్చిన మొత్తం 35,000 తీర్పులను ప్రతి పౌరునికి ప్రతి భాషలో అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)