'ఫ్లడ్‌వాచ్‌' యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర జలసంఘం

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా వరద బీభత్స ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 'ఫ్లడ్‌వాచ్‌' పేరుతో ఓ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ సాయంతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. దేశంలో ఎక్కడ వరదలు సంభవించినా ఆ ప్రభావిత ప్రాంతాల రియల్‌ టైమ్‌ సమాచారం ఇందులో ప్రత్యక్షం కానుంది. 338 స్టేషన్ల నుంచి వచ్చే సమాచారాన్ని ఈ యాప్‌ క్రోడీకరిస్తుంది. తద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తుందని సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్‌ కుశ్వీందర్‌ వోహ్రా తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలకు మొబైల్‌ ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేసి.. అక్కడి ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ యాప్‌ రూపకల్పన వెనకున్న ముఖ్య ఉద్దేశమని వోహ్రా వెల్లడించారు. ఏడు రోజుల వరకు సూచనలు ఇందులో కన్పిస్తాయన్నారు. శాటిలైట్‌ డేటా విశ్లేషణ, గణాంకాల నమూనా, రియల్‌ టైమ్‌ సమాచారాన్ని వినియోగించుకునే అధునాతన సాంకేతికత ఈ యాప్‌లో పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. తద్వారా సకాలంలో కచ్చితమైన అంచనాలు ప్రజలకు తెలుస్తాయని వివరించారు. 'ఫ్లడ్‌వాచ్‌' యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌ సేవలను ఎవరైనా సులభంగా వినియోగించుకోవచ్చని వోహ్రా తెలిపారు. ఆడియో, టెక్ట్స్‌ రూపంలో ప్రజలకు సందేశాలు ఈ యాప్‌ ద్వారా సందేశాలు చేరవేస్తామన్నారు. ప్రస్తుతం ఇంగ్లిషు, హిందీ భాషల్లో మాత్రమే సేవలను పొందుపరిచామని, త్వరల్లో అన్ని స్థానిక భాషలను జత చేస్తామని చెప్పారు. వరద ముప్పుతో అల్లాడుతున్న హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో 'ఫ్లడ్ వాచ్‌' యాప్‌ సేవలు అందుబాటులోకి రావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని వోహ్రా వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)