ఒడిశాలో ఓ ఐపీఎస్ అధికారి భార్య వేధింపులు తాళలేక ఓ మహిళా హోంగార్డు ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో ఆమె రెండు కాళ్లను కోల్పోయారు. ఐపీఎస్ ఇంట్లో పనిచేస్తోన్న తనపై ఆయన భార్య వేధింపులకు పాల్పడుతోందంటూ బాధిత మహిళా హోంగార్డు చేసిన ఫిర్యాదుపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒడిశాలోని నార్త్ సెంట్రల్ రేంజ్ డీఐజీ బ్రిజేష్ కుమార్ ఇంట్లో ఓ మహిళా హోంగార్డు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో అధికారి భార్య తనను తరచూ వేధింపులకు గురిచేసేదని మహిళా హోంగార్డు ఆరోపించారు. ఆగస్టు 4న కూడా తనపై దాడి చేయడంతో మనస్తాపానికి గురై.. రైలు కింద పడి చనిపోయేందుకు యత్నించినట్లు తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రెండు కాళ్లు కోల్పోయినట్లు వివరించారు. ప్రస్తుతం కటక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహిళా హోంగార్డ్ చేసిన ఆరోపణలను డీఐజీ బ్రిజేష్ కుమార్ తోసిపుచ్చారు. కుటుంబ సమస్యలతో మానసికంగా కలత చెంది అటువంటి ఆరోపణలు చేసిందన్నారు. దీనిపై ఒడిశా హోంగార్డు డీజీ సుధాంశు సారంగి స్పందిస్తూ.. మహిళా హోంగార్డు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాలి ఆరోపణల నేపథ్యంలో సదరు ఐపీఎస్ అధికారిని కటక్లోని పోలీస్ హెడ్క్వార్టర్కు బదిలీ చేశారు.
ఐపీఎస్ భార్య వేధింపులు తాళలేక రెండుకాళ్లు కోల్పోయిన మహిళా హోంగార్డు !
August 22, 2023
0
Tags