మహారాష్ట్రలో ఓ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్కు బహిరంగంగా ట్విట్టర్ ద్వారా సౌరభ్ పింపాల్కర్ అనే వ్యక్తి నుంచి బెదిరింపు వచ్చింది. ఈ ట్వీట్లో అభ్యంతరవ్యాఖ్యలు ఉన్నాయి. తాజాగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఫోన్ నెంబర్కు వాట్సప్ సందేశమొచ్చింది. ఈ సందేశం సారాంశం శరద్ పవార్ను చంపేస్తామని. ఈ ఘటనపై సుప్రియా సూలే నేరుగా ముంబై పోలీస్ కమీషనర్కు ఫిర్యాదు చేశారు. తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓ మహిళగా, పౌరురాలిగా, మహారాష్ట్ర, దేశ హోంమంత్రి నుంచి న్యాయం కోరుతున్నానని సుప్రియా సూలే తెలిపారు. తన తండ్రి శరద్ పవార్కు ఏమైనా జరిగితే కేంద్ర, రాష్ట్ర హోంమంత్రులు బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ నిఘా యంత్రాంగంపై బాధ్యత ఉందని..రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా ఉందని సుప్రియా సూలే ఆరోపించారు. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందన్నారు. ఈ తరహా చేష్టలు రాజకీయాల్లో దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. శరద్ పవార్ రక్షణ బాధ్యత కేంద్రానిదేనన్నారు. తన తండ్రికి ఏమైనా హాని కలిగితే హోంమంత్రి బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర హోంశాఖలు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. కాగా ఈ వ్యవహారంపై తక్షణం చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశించారు. ఈ బెదిరింపు వెనుక ఎవరున్నారు, అదృశ్య హస్తముందా అని సుప్రియూ సూలే ప్రశ్నించారు. బెదిరింపులో మాట్లాడిన భాష, వ్యాఖ్యలు చూస్తుంటే ఎంత ద్వేషముందో తెలుస్తోందన్నారు. రాజకీయపరంగా విబేధాలున్నా ఇంత ద్వేషమెందుకన్నారు. ఈ ఘటనపై త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమౌతానన్నారు ఎంపీ సుప్రియా సూలే. ప్రభుత్వం మహిళా సంరక్షణ గురించి పైకి మాట్లాడుతున్నా వాస్తవంలో మాత్రం ఆడపిల్లలకు భద్రత లేదన్నారు.
శరద్ పవార్ను చంపేస్తామంటూ సుప్రియా సూలేకు వాట్సప్ !
June 09, 2023
0
Tags