ఉత్తరప్రదేశ్లోని గోండాలో నిర్వహించిన ర్యాలీలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ 2024లో తాను ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే..ర్యాలీలో బ్రిజ్ భూషణ్ ఓ ఆసక్తికరమైన కవిత వినిపించారు. బాధ, కన్నీరు,మోసం, ప్రేమలపై సాగింది ఆ కవిత. ఈయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్ల పేర్లు ప్రస్తావించకుండానే ఈ మేరకు మాట్లాడారు. 'కొన్నిసార్లు కన్నీళ్లనే తాగాల్సి రావొచ్చు. బాధను అనుభవించాల్సి ఉంటుంది. విషాన్నే మింగాల్సి పరిస్థితి ఎదురవ్వొచ్చు. అన్నీ భరిస్తేనే సమాజంలో మనుగడ సాగించగలం. నా ప్రేమకు దక్కిన ప్రతిఫలం ఇదే. కొందరు నన్ను తిడుతున్నారు. పొగుడుతున్నారు. నా పేరే నిత్యం పలుకుతున్నారు.'అంటూ సాగిన ఈ కవితను 2024 ఎన్నికల కోసం బీజేపీ నిర్వహించిన మహాసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా వినిపించారు. 2024లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని బ్రిజ్ భూషణ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దేశం కోల్పోయినదంతా ప్రధాని మోడీ తీసుకువస్తున్నారని అన్నారు. బ్రిజ్ భూషణ్పై ఆరోపణలకు సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలని ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు సమన్లు జారీ చేసిన విషయం విదితమే.
కొన్నిసార్లు కన్నీళ్లు తాగాల్సి రావచ్చు !
June 11, 2023
0
Tags