బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సీఎం భద్రతా వలయాన్ని దాటుకుని ఓ బైకు ముఖ్యమంత్రికి వద్దకు అత్యంత సమీపంగా దూసుకురావడం కలకలం రేపింది. ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా కొందరు వ్యక్తులు బైక్ పై వెళుతూ దాదాపు బీహార్ సీఎం నితీష్ కుమార్ ను ఢీ కొట్టినంత పని చేశారు. వెంటనే అప్రమత్తమైన నితీష్ కుమార్ పక్కనే ఉన్న పుట్ పాత్ పైకి దూకడంతో పెను ప్రమాదం తప్పింది. వాకింగ్ కోసం సీఎం తన ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే సీఎం చుట్టూ ఎప్పుడూ భారీ భద్రత ఉంటుంది. కానీ సెక్యురిటీని దాటుకుని సీఎంను ఢీకొట్టబోయేంత వరకు బైక్ లు వెళ్లడంతో ముఖ్యమంత్రి భద్రతలో భారీ వైఫల్యం తలెత్తింది. త్వరలో పాట్నా వేదికగా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని నితీష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. బైక్పై వచ్చినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం రబ్రీ దేవితో సహా పలువురు రాజకీయ నాయకులు నివసించే సర్క్యులర్ రోడ్ సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఇద్దరు యువకులు తమ మోటార్ సైకిల్ను వేగంగా నడుపుతూ తన సెక్యూరిటీ కవర్లోకి ప్రవేశించడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వయంగా ఫుట్పాత్పైకి దూకారు అని పోలీసు అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. సీఎం భద్రతా లోపంపై విచారణ కొనసాగుతుంది.
నితీష్ కుమార్ కు తృటిలో తప్పిన ప్రమాదం
June 15, 2023
0
Tags