మహారాష్ట్రలోని పుణె, సదాశివ్ పేట్ ప్రాంతంలో రద్దీగా ఉన్న రోడ్డు మీద టూ వీలర్పై వెళ్తున్న 20 ఏళ్ల యువతిని యువకుడు అడ్డగించాడు. వెంటనే తన వద్ద ఉన్న పదునైన కత్తి వంటి ఆయుధాన్ని తీసి యువతిపై దాడికి యత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు స్కూటీ వదిలేసి యువతి వీధుల్లో పరుగెత్తింది. యువకుడు ఆమె వెంటే పరుగెత్తాడు. ఈ క్రమంలో ఆమె వీపుపై దాడి చేయడంతో కింద పడింది. మళ్లీ లేచి పరుగెత్తుండగా ఆ వ్యక్తి ఆమెపై దాడి చేస్తూనే ఉన్నాడు. ఇంతలో రోడ్డుపై వెళుతున్న కొంతమంది అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానికులు యువకుడిపై రళ్లు రువ్వారు. ఎట్టకేలకు యువతిని రక్షించి, దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. పంజాబీ డ్రెస్, ముఖానికి స్కార్ఫ్ ధరించిన యువతి భుజంపై బ్యాగ్తో రోడ్డుపై పరుగెత్తడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వైట్ షార్ట్, ప్యాంట్ వేసుకున్న యువకుడు ఆమె వెనకాల వెంబడించడం కూడా తెలుస్తోంది. కాగా నిందితుడిని అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పుణె డీసీపీ సందీప్ సింగ్ తెలిపారు.
నిందితుడిని శాంతను లక్ష్మణ్ జాదవ్గా గుర్తించారు. యువతిని 20 ఏళ్ల ప్రీతి రామచంద్రగా పోలీసులు పేర్కొన్నారు. అయితే నిందితుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నట్లు ఆమె తల్లి ఆరోపించారు. ఈ విషయంపై యువకుడి తండ్రికి కూడా ఫిర్యాదు చేశామని అయినా ఈ రోజు తన కూతురిని చంపడానికి ప్రయత్నించాడని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారడంతో యువతిని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.