బొమ్మైతో డీకే కీలక భేటీ !

Telugu Lo Computer
0


కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ట్రబుల్ షూటర్ అనే పేరుంది. పార్టీలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటిని చాకచక్యంగా పరిష్కరిస్తారని చెబుతుంటారు. కిందటి నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారాయన. అప్పటి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో కలిసి బలమైన భారతీయ జనతా పార్టీని మట్టి కరిపించగలిగారు. ప్రస్తుతం ఆయన దృష్టి తెలంగాణపై ఉంది. ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేలా పావులు కదుపుతున్నారు. సొంత రాష్ట్రానికే చెందిన ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేతో కలిసి వ్యూహాలను రూపొందిస్తోన్నారు. ఇందులో భాగంగానే భువనగిరికి చెందిన కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మధ్యాహ్నం బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. కర్ణాటకతో సరిహద్దులను పంచుకుంటోన్న తెలంగాణలో ఈ సారి పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలనే పట్టుదలతో ఉన్నారు డీకే శివకుమార్. ఇదివరకు రెండుసార్లు తెలంగాణలో పర్యటించి వచ్చారు కూడా. అక్కడి క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై క్షున్నంగా అధ్యయనం చేశారు. దీనికి అనుగుణంగా ఆయన తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ పరిణామాల మధ్య- డీకే శివకుమార్ ఈ సాయంత్రం బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో భేటీ అయ్యారు. బెంగళూరులోని నివాసానికి వెళ్లి మరీ ఆయనను కలుసుకున్నారు. శాలువా కప్పారు. పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు. సుమారు 40 నిమిషాల పాటు బసవరాజ్ బొమ్మైతో ఏకాంతంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. విద్యుత్ బిల్లుల పెంపుపై ప్రస్తుతం బీజేపీ కత్తులు నూరుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధానికి సమాయాత్తమౌతోంది. ఇప్పటికే బొమ్మై, సీటీ రవి, బీఎస్ యడ్యూరప్ప.. వంటి నాయకులు సిద్ధరామయ్య సర్కార్‌పై విమర్శనాస్త్రాలను సంధించారు. త్వరలోనే భారీ ఆందోళనలకు దిగబోతోన్నారు. ఈ పరిస్థితుల్లో డీకే శివకుమార్.. ఎలాంటి భేషజాలు లేకుండా నేరుగా బొమ్మై ఇంటికి వెళ్లి ఆయనను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)