జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్పై భారత్ స్టార్ రెజ్లర్ల తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాము చేసిన ఆరోపణలపై న్యాయం చేయాలని కోరుతూ స్టార్ రెజ్లర్లు కొద్దిరోజులుగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా రెజ్లర్లకు యోగా గురువు బాబా రాందేవ్ తన మద్దతు ప్రకటించారు. రాజస్థాన్లోని భిల్వారాలో మూడు రోజుల పాటు జరుగుతున్న యోగా కార్యక్రమాలకు బాబా రాందేవ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ టాప్ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసనకు కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా సిగ్గు చేటు. అలాంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అతడు తల్లులు, బిడ్డలు, అక్క చెల్లెళ్ల గురించి ప్రతిరోజూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. అతడి తీరు ఖండించదగినది' అని అన్నారు. అంతకుముందు కూడా రెజ్లర్ల ఆందోళనపై బాబా రాందేవ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..'రెజ్లర్లు ఒలింపిక్స్లో దేశానికి ఖ్యాతి తెచ్చినప్పుడు సంబరాలు చేసుకున్నాం. న్యాయం కోసం పోరాడుతున్న ఈ సమయంలో వారికి మనం అండగా నిలవాలి. రెజ్లింగ్ సమాఖ్య చీఫ్పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలి' అని ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో బ్రిజ్ భూషణ్ అరెస్ట్పై కూడా బాబా రాందేవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటికీ అరెస్ట్ కాలేదన్నారు. ఈ విషయంలో తాను ప్రకటనలు మాత్రమే చేయగలనన్నారు. అతడిని జైలులో పెట్టే అధికారం తనకు లేదని వ్యాఖ్యలు చేశారు.
బ్రిజ్ భూషణ్ను అరెస్ట్ చేయాల్సిందే : బాబా రాందేవ్
May 27, 2023
0
Tags