వచ్చే ఏడాది సెప్టెంబరులో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న జి-20 సదస్సుకు సంబంధించి సూచనలు, సలహాలు, చర్చలు, వ్యూహాలను ఖరారు చేసేందుకు కేంద్రం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే ఈ సమావేశానికి దాదాపు 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. భారతదేశం అధికారికంగా డిసెంబర్ 1న జి-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 200 సమావేశాలను నిర్వహించనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలో జి-20 సదస్సు జరగనుంది. దీనికి సభ్యదేశాల దేశాధినేతలు లేదా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణపై దేశంలోని పలు ప్రాంతాల్లో కేంద్రం సమావేశాలు ఏర్పాటు చేయనుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె దిల్లీ చేరుకోనున్నారు. అయితే తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కాకుండా తృణమూల్ కాంగ్రెస్ చైర్పర్సన్ హోదాలో ఈ సమావేశంలో పాల్గొంటానని మమత చెప్పారు.
అఖిలపక్ష సమావేశానికి 40 పార్టీలను ఆహ్వానించిన కేంద్రం
December 04, 2022
0
Tags