హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఇస్లాంలో హిజబ్ తప్పనిసరి కాదని హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజబ్ ధరించడం కూడా తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. విద్యార్థులు ప్రోటోకాల్ పాటించాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. విద్యాసంస్థల్లో హిజబ్ నిషేధాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు హిజబ్పై దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి జీవో ఇచ్చే అధికారం ఉందని హైకోర్టు పేర్కొంది. 2022 జనవరి 1వ తేదీన ఉడుపికి చెందిన ప్రభుత్వ కళాశాలలో హిజాబ్ ధరించిన ఆరుగురు విద్యార్థులను సిబ్బంది లోపలికి అనుమతించలేదు. కళాశాల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వాళ్లను అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి హిజాబ్ వ్యవహారం మొదలైన సంగతి తెలిసిందే. అలా కర్ణాటక నుంచి మొదలై ప్రపంచమంతా హిజాబ్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థల్లో హిజాబ్ను కర్ణాటక ప్రభుత్వం అనుమతించలేదంటూ దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి అవసరమైన ఆచారం కాదంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్,జస్టిస్ జేఎం ఖాజి ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఫిబ్రవరి 5 నాటి ప్రభుత్వ ఉత్తర్వును చెల్లుబాటయ్యేలా కేసు నమోదు చేయలేదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. హిజాబ్ ఇస్లాం ముఖ్యమైన మతపరమైన ఆచారాలలో భాగం కాదని అభిప్రాయపడింది. యూనిఫాం అవసరం అనేది ఆర్టికల్ 19(1)(a) ప్రకారం.. భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కుపై సహేతుకమైన పరిమితి ఉంటుందని తెలిపింది. విచారణ ప్రారంభమైన మొదటి రోజే, విద్యార్థులు హిజాబ్, కాషాయ కండువాలు ధరించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హిజాబ్ అభ్యంతరాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై 11 రోజులపాటు సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. తీర్పును ఫిబ్రవరి 25వ తేదీన రిజర్వ్లో ఉంచిన సంగతి తెలిసిందే. హిజాబ్ తీర్పు నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. హిజాబ్ వివాదం మొదలైన.. ఉడుపిలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
ఇస్లాంలో హిజబ్ తప్పనిసరి కాదని కర్ణాటక హైకోర్టు తీర్పు
March 15, 2022
0
Tags