ఉక్రెయిన్​ క్షిపణి దాడిలో 20 మంది మృతి

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కీవ్​, మైకొలేవ్​, ఖర్కివ్​, ఖేర్సన్​ సహా పలు ప్రధాన నగరాలపై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. చెర్నిహైవ్​ నగరం.. మూడు శక్తిమంతమైన దాడులతో దద్దరిల్లింది. కీవ్​లో సరకు రవాణా విమానాలు తయారుచేసే పరిశ్రమపై దాడి జరిగింది. మరోవైపు.. డొనెట్స్క్​లో ఉక్రెయిన్​ క్షిపణి దాడి జరపగా.. 20 మంది చనిపోయారు. మరో 28 మంది గాయపడ్డారు. డొన్​బాస్​లో ఇరు వర్గాల మధ్య భీకర దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్​ ఆర్మీ ప్రకారం.. 100 మందికిపైగా రష్యా సైనికులు మరణించారు. ఆరు వాహనాలు ధ్వంసమైనట్లు కీవ్​ ఇండిపెండెంట్​ పేర్కొంది. అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్‌ను ఉద్దేశించి జెలెన్​స్కీ చేసే ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని బైడెన్ సర్కార్ నిర్ణయించింది. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న దేశాధినేతకు తామిచ్చే గౌరవానికి ఈ ప్రసంగం.. ఓ నిదర్శనమని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులు, తాము చేస్తున్న ప్రతిఘటనను జెలెన్​స్కీ అమెరికా చట్టసభలకు వివరించనున్నారు. ఈనెల మొదటి వారంలో ఒకసారి అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి వీడియో కాల్‌ ద్వారా మాట్లాడిన జెలెన్​స్కీ.. మరింత సైనిక సాయం చేయాలని అభ్యర్థించారు. బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) మరోసారి సాయం కోసం విజ్ఞప్తి చేయనున్నారు. ఉక్రెయిన్‌కు 13.6 బిలియన్‌ డాలర్ల సాయం చేసే బిల్లును ఇటీవలే అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించింది. ఆ బిల్లుపై బైడెన్ మంగళవారం సంతకం చేయనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)