కోవిడ్-19 మూలాలు పూర్తిగా అర్థం చేసుకోకపోతే కోవిడ్ -26, కోవిడ్ -32 కూడా వచ్చే అవకాశం ఉందని అమెరికా చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మహమ్మారి ఎలా ప్రారంభమైందో తెలియకపోవడం వల్ల భవిష్యత్తుల వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోడైరెక్టర్ పీటర్ హోటెజ్ తెలిపారు.
కోవిడ్-19 ఆనవాళ్లు కనుక్కోలేకపోతే విలయాలు తప్పవని అమెరికా శాస్త్రవేత్త , అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) కమిషనర్గా పని చేసిన స్కాట్ గాట్లిబ్ అభిప్రాయపడ్డారు.
సార్స్ సీవోవీ2 వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీకైనట్లు ఆధారాలు బలపడుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలకు చైనా సహకారం కావాలని, భవిష్యత్తు మహమ్మారులను అడ్డుకోవాలంటే ఈ చర్యలు తప్పవని స్కాట్ తెలిపారు. చైనాలో సుదీర్ఘ కాలం విచారణ చేపట్టేందుకు శాస్త్రవేత్తలను అనుమతించాలన్నారు. అలాగే అక్కడి మనుషులు, జంతువుల నుంచి రక్త నమూనాలు సేకరించేందుకు శాస్త్రవేత్తలను అనుమతించాలని హోటెజ్ తెలిపారు. సైంటిస్టులు, ఎపిడమాలజిస్ట్లు, వైరాలజిస్టులు, బ్యాట్ ఎకాలజిస్ట్ పరిశోధకులు హుబే ప్రావిన్సులో సుమారు ఆరు నెలలు ఉండాలని హోటెజ్ పేర్కొన్నారు.