ధూమపానం చేసేవారిలో కోవిడ్19 బారిన అవకాశం 50 శాతం పెరుగుతుందని, కరోనా సోకితే మరణించే అవకాశాలు అధికంగా ఉంటాయని, క్యాన్సర్, గుండెపోటు, శ్వాశకోశ వ్యాధులు మరింత పెరుగుతాయని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనామ్ గెబ్రెయోసస్ తెలిపారు. కరోనా వైరస్ బారిన పడరాదంటే స్మోకింగ్ మానేయడం తప్పనిసరి అని, తద్వారా కరోనాపై పోరాటాన్ని సైతం ముమ్మరం చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మిలియన్ల మంది ధూమపానాన్ని మానివేస్తున్నట్లు చెబుతున్నారు. తమతో పాటు కుటుంబసభ్యుల ప్రాణాలను ముప్పు బారిన పడకుండా చూసేందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. నేడు వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ట్వీట్ చేసింది.
పొగాకు లేని సమాజం కోసం పోరాటంలో భాగంగా తమతో చేతులు కలపాలని ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్వో చీఫ్ కోరారు. ఈ అలవాటు మానేందుకుగానూ కొన్ని పరికరాలతో సహకారం అందిస్తామని చెప్పారు. భారత్లో ఈ సిగరెట్స్ మరియు హీటెట్ టొబాకో ఉత్పత్తులు నిషేధించడంతో ఆరోగ్య కుంటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్దన్కు, టొబాకో కంట్రోల్ రీసెర్చ్ గ్రూప్లకు యూకేలోని బాత్ యూనివర్సిటీలో ప్రత్యేక గుర్తింపు అవార్డులు అందించినట్లు డాక్టర్ టెడ్రోస్ అదనామ్ గెబ్రెయోసస్ గుర్తుచేశారు.