అమెరికా లోని న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ ఈ ఏడాది ప్రారంభంలో భారత్ నుంచి ప్రేరేపిత దాడిని ఎదుర్కొన్నామంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి, భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంపై ప్రస్తావించారు. తమ సైన్యం అద్భుతమైన నైపుణ్యం, ధైర్యం, చతురతతో భారత్ దాడిని తిప్పికొట్టాయంటూ చెప్పుకొచ్చారు. భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెబుతోందని పేర్కొంది. పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలపై భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోత్ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 'ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడదు. అయితే, ఏ స్థాయిలోనూ వాస్తవాలను వారి అబద్ధాలు దాచలేవు. ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో మునిగిపోయింది. ఉగ్రవాదంపై యుద్ధంలో భాగస్వామిగా నటిస్తూనే ఒక దశాబ్దం పాటూ ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం కల్పించింది' అంటూ వ్యాఖ్యానించారు. పాక్ ప్రాయోజిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ జమ్ము కశ్మీర్లో ఊచకోతకు పాల్పడింది. ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 10న యుద్ధం ముగించాలంటూ పాక్ సైన్యమే భారత్ను వేడుకుంది. కానీ వాళ్లు (పాక్ను ఉద్దేశిస్తూ) మేము యుద్ధంలో గెలిచాము అంటూ, శాంతిని నెలకొల్పామంటూ చెప్పుకుంటున్నారు. ఆపరేషన్ సిందూర్లో ధ్వంసమైన రన్వేలు, హ్యాంగర్లను పాక్ విజయంగా భావిస్తే.. దాయాది దేశం దాన్ని ఆస్వాదించొచ్చు. భారత్లోని అమాయక పౌరులపై జరిగిన దాడికి పాక్ బాధ్యత వహించాలి. పాక్ నిజంగా శాంతిని కోరుకుంటే.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపి భారత్ కోరుకున్న ఉగ్రవాదులను అప్పగించాలి. అణు బెదిరింపులతో ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని భారత్ ఎప్పటికీ సహించదు. అలాంటి వాటికి తలొగ్గదు' అని పేటల్ గహ్లోత్ స్పష్టం చేశారు.
ఏ స్థాయిలోనూ వాస్తవాలను పాకిస్తాన్ అబద్ధాలు దాచలేవు : భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోత్
September 27, 2025
0
Tags