కామ్ ఎయిర్ విమానం RQ-4401 కాబూల్ నుండి బయలుదేరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత, సిబ్బంది ఆ విమానం వద్ద ఓ బాలుడు తిరుగుతుండటాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన విమానయాన సిబ్బంది ఆ బాలుడిని పట్టుకొని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందికి అప్పగించారు. అధికారులు బాలుడిని ప్రశ్నించగా, అతను ఆఫ్ఘనిస్తాన్లోని కుందుజ్ నగరానికి చెందినవాడని చెప్పాడు. కాబూల్ విమానాశ్రయంలోకి చొరబడి విమానం వెనుక సెంట్రల్ ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్ లోపల దాక్కొని వచ్చానని చెప్పాడు. సరదా కోసమే ఇలా చేశానని, అందులో ఉన్న ప్రమాదం గురించి తనకు తెలియదని బాలుడు తెలిపాడు. విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్ను తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది, ఓ చిన్న ఎరుపు రంగు స్పీకర్ను కనుగొన్నారు. ఈ సంఘటన తర్వాత, విమానం భద్రతను నిర్ధారించడానికి సమగ్ర తనిఖీలు నిర్వహించారు. బాలుడు మైనర్ కావడంతో అతనిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. అధికారుల విచారణ తర్వాత, అదే రోజు ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు అతను వచ్చిన విమానంలోనే అతన్ని ఆఫ్ఘనిస్తాన్కు పంపించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన విమానాశ్రయ భద్రతలో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టింది.
విమానం ల్యాండింగ్ గేర్లో దాక్కొని ఢిల్లీకి చేరిన ఆఫ్ఘనిస్తాన్ బాలుడు : అదే విమానంలో అతన్ని వెనక్కి పంపిన అధికారులు
September 23, 2025
0
Tags