ఆఫ్ఘానిస్థాన్‌లో వరుస భూకంపాలు : 500 మంది దుర్మరణం : భూకంపం తీవ్రత 6.0గా నమోదు

Telugu Lo Computer
0


ఫ్ఘానిస్థాన్‌ను వరుస భూకంపాలు వణికించాయి. ఆదివారం రాత్రి తూర్పు ఆఫ్ఘాన్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.0గా నమోదైంది. రాత్రి 11.47గంటల సమయంలో పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని నంగహార్ ప్రావిన్స్ జలాలాబాద్ సమీపంలో ఎనిమిది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది. అర్థరాత్రి 12.10 గంటల సమయంలో అదే ప్రావిన్సులో 4.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. భారీ భూకంపం దాటికి ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలో వందలాది మంది చనిపోయారని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. అయితే, ఈ భారీ భూకంపం కారణంగా 500 మందికిపైగా మరణించగా.. వేలాది మంది గాయపడినట్లు తెలిసింది. ఈ భూకంపం కారణంగా కునార్ ప్రాంతం అత్యంత తీవ్రంగా దెబ్బతిందని తెలిపింది. భారీ భూకంపం పలు గ్రామాలను పూర్తిగా నేలమట్టం చేసిందని, ఒకే గ్రామంలో 30మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కునార్, నంగర్‌హార్, నోరిస్తాన్ ప్రావిన్సులు వినాశకరమైన భూకంపంతో అతలాకుతలమయ్యాయి. ఇళ్లు నేలమట్టమై వేలాది మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు గాయపడ్డారు. భూకంపం సంభవించిన ప్రాంతాలకు చేరుకోవడం చాలా కష్టంగా ఉంది. అయినా మా బృందాలు ఇప్పటికే సంఘటనా స్థలంకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ భూకంపందాటికి గాయపడిన వందలాది మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించాం. రోడ్లు కనెక్టివిటీ తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రాంతీయ సమాచార అధిపతి నజీబుల్లా హనీఫ్ తెలిపారు. భూకంపం వల్ల సంభవించిన మరణాలతో తీవ్ర దిగ్భ్రాంతి చెందానని ఆఫ్ఘానిస్థాన్​ క్రికెటర్ రహ్మనుల్లా గుర్బాజ్ తెలిపాడు. "కునార్‌లో సంభవించిన విషాదకరమైన భూకంపం నన్ను తీవ్రంగా బాధించింది. బాధితులు, వారి కుటుంబాలతో నా ప్రార్థనలు ఉన్నాయి. గాయపడిన వారికి, బాధితులకు బలాన్ని ప్రసాదించుగాక" అని ఎక్స్​లో పోస్ట్ చేశారు

Post a Comment

0Comments

Post a Comment (0)