ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సమీపంలోని టోల్గేట్ వద్ద చోటుచేసుకున్న సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్న ఒక ఆర్మీ జవాన్పై టోల్గేట్ సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేయడం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. కర్రలతో రక్షక భటుడిపై దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించిన ఈ సంఘటన తర్వాత ప్రజలు ఆగ్రహావేశంతో టోల్గేట్ను ధ్వంసం చేశారు. సిబ్బందిపై దాడి చేసి, టోల్గేట్ ఆఫీస్లోని సామగ్రిని నాశనం చేశారు.ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడి చేసిన ఆరుగురు టోల్ సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు సిబ్బందిపై గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. ఇదే సమయంలో జవాన్పై దాడి చేసిన భూని టోల్ ఏజెన్సీపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కఠిన చర్యలు ప్రారంభించింది. టోల్ గేట్ నిర్వహణలో నిర్లక్ష్యం, ఉద్యోగుల అహంకార ధోరణి కారణంగా ఈ సంఘటన చోటు చేసుకుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ గుర్తించింది. దీంతో టోల్గేట్పై రూ.20 లక్షల భారీ జరిమానా విధించింది. అంతేకాదు, భవిష్యత్తులో ఎలాంటి టెండర్లలోనూ, బిడ్డింగ్లలోనూ ఈ టోల్ కంపెనీ పాల్గొనకుండా బ్లాక్లిస్ట్లో చేర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకవైపు చట్టపరమైన చర్యలు కొనసాగుతుండగా, మరోవైపు జవాన్ల భద్రత, గౌరవం గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టే సైనికులను రక్షించాల్సిన సమాజమే వారిపై దాడికి దిగడం తగదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను ఖండిస్తూ సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మీరట్ లో జవాన్పై దాడి చేసిన టోల్గేట్ను ధ్వంసం చేసిన స్థానికులు !
August 19, 2025
0
Tags