కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన 'ధర్మస్థల' ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ సామూహిక ఖనన కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. మృతదేహాలు పూడ్చి పెట్టిన 15 అనుమానిత ప్రదేశాలను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా సిట్ దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. ఇందులో ఆరో ప్రదేశం వద్ద పాక్షిక అస్థిపంజర అవశేషాలు కనుగొన్నారు. పోలీసు వర్గాల సమాచారం మేరకు అస్థిపంజర అవశేషాలు పురుషుడివి అయి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ కేసులో లభ్యమైన మొదటి స్పష్టమైన ఆధారంగా నమోదవుతుండటం గమనార్హం. సంఘటనా స్థలంలోని ఫోరెన్సిక్ బృందం తదుపరి పరీక్ష కోసం అవశేషాలను భద్రపరిచింది. ఫోరెన్సిక్ పరీక్ష అనంతరం అస్థిపంజరానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా బుధవారం వరకు ఐదు ప్రదేశాలలో మానవ అవశేషాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని పోలీసు వర్గాలు ధృవీకరించాయి. నేత్రావతి నది వెంబడి ఉన్న ఈ ప్రదేశాలలో మంగళవారం విజిల్బ్లోయర్ సమక్షంలో తవ్వాకాలు చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు, రెవెన్యూ శాఖ సిబ్బంది సమక్షంలో జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి లోతుగా తవ్వినప్పటికీ, ఆ స్థలాల్లో ఎటువంటి అవశేషాలు లభించలేదని తెలిపారు.
ధర్మస్థలలో అస్థిపంజర అవశేషాలు లభ్యం !
July 31, 2025
0
Tags