టన్ను వ్యర్థాలకు రూ.30,000 ఇచ్చి కొంటున్న మైక్రోసాఫ్ట్ !

Telugu Lo Computer
0


మైక్రోసాఫ్ట్ మనుషుల మలం, మూత్రాన్ని డబ్బు పెట్టి కొంటోంది. ఒక టన్ను వ్యర్థాలకు ఏకంగా రూ.30,000 (350 డాలర్లు) ఇస్తోందట. వోల్టెడ్ డీప్ అనే కంపెనీతో 12 ఏళ్ల ఒప్పందం కూడా చేసుకుంది. ఈ డీల్ ప్రకారం మైక్రోసాఫ్ట్ మొత్తం 4.9 మిలియన్ మెట్రిక్ టన్నుల సేంద్రీయ వ్యర్థాలను కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం రూ.14 -15 వేల కోట్లు ఖర్చు చేయనుంది. మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి భారీ మొత్తంలో కార్బన్ వాయువులు విడుదల అవుతున్నాయి. 2020 నుండి 2024 వరకు, మైక్రోసాఫ్ట్ ఏకంగా 75.5 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలకు కారణమైంది. పర్యావరణ నిబంధనల ప్రకారం కంపెనీలు ఎంత కాలుష్యాన్ని విడుదల చేస్తాయో, అంతే మొత్తాన్ని తగ్గించడానికి కూడా కృషి చేయాలి. ఈ లక్ష్యం కారణంగా మైక్రోసాఫ్ట్ 2030 నాటికి కార్బన్ నెగటివ్ కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి వోల్టెడ్ డీప్తో పార్టనర్ షిప్ కుదుర్చుకుంది. వోల్టెడ్ డీప్ కంపెనీ ఏం చేస్తుందంటే తిరిగి రీసైకిల్ చేయడానికి కష్టమైన జీవ వ్యర్థాలను సేకరిస్తుంది. ఈ వ్యర్థాలను పైపుల ద్వారా భూమి లోపల 5,000 అడుగుల లోతుకు పంప్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల జీవ వ్యర్థాలు కుళ్లిపోయే ప్రక్రియ ఆగిపోతుంది. ఫలితంగా, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలోకి రిలీజ్ కాకుండా ఆగిపోతాయి. ఇది పర్యావరణ కాలుష్యాన్ని కంట్రోల్ చేయడంలో చాలా సహాయపడుతుంది. మైక్రోసాఫ్ట్ వంటి ఆధునిక టెక్ కంపెనీలు పనిచేయడానికి పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే ప్రక్రియలు తప్పవు. అందుకే, చాలా కంపెనీలు ఒక చోట పేరుకుపోయిన కాలుష్యాన్ని ఇంకో చోట తగ్గించుకోవడానికి కృషి చేస్తాయి. అందుకే కార్బన్ క్రెడిట్ సిస్టమ్ అనేది ఉంది. పర్యావరణానికి మేలు చేసే పనుల కోసం డబ్బు ఖర్చు చేయడం ద్వారా కార్బన్ క్రెడిట్‌లను సంపాదించవచ్చు. ఈ కార్బన్ క్రెడిట్‌లు కంపెనీలు తమ కార్బన్ ఉద్గార లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడతాయి. మైక్రోసాఫ్ట్ కూడా ఇదే పద్ధతిలో తన కార్బన్ ముద్ర తగ్గించుకోవడానికి ఈ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)