హార్ముజ్‌ జలసంధి మూసివేతతో ఆకాశాన్నంటనున్న ముడి చమురు, గ్యాస్ ధరలు ?

Telugu Lo Computer
0


హార్ముజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. హార్ముజ్‌ జలసంధి మూసివేతకు ఆ దేశ పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేయడంతో ఇరాన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా దాడుల తర్వాత ఓపిక నశించిన ఇరాన్‌ ఇక హార్ముజ్‌ జలసంధి మూసివేతే లక్ష్యంగా పావులు కదిపింది. దీనికనుగుణంగా పార్లమెంట్‌ ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న ఇరాన్‌.. ప్రపంచ దేశాలకు ఎంతో కీలకమైన ఆ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. ఇరాన్‌ నిర్ణయం, ముడి చమురు ధరల పెరుగుదలకు దారితీయనుంది. హార్ముజ్‌ జలసంధి ద్వారా ప్రపంచానికి 20 శాతం ముడి చమురు సరఫరా అవుతుంది. క్రూడాయిల్‌, గ్యాస్‌ దిగుమతులపై ఆధారపడ్డ భారత్‌ లాంటి దేశాలపై ఇరాన్‌ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. నిత్యం హార్ముజ్‌ జలసంధి ద్వారా భారత్‌కు చేరే ముడి చమురు సుమారు 15 లక్షల బ్యారెళ్లు. ఈ రవాణా ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి నిలిచిపోనుంది. అయితే భారత్‌ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోది. అమెరికా, రష్యాల నుంచి చమురు దిగుమతి పెంచేందుకు అడుగులు వేస్తోంది. ఇతర ఆసియా దేశాల మాదిరిగానే, భారతదేశం తన చమురు అవసరాలలో ఎక్కువ భాగాన్ని మధ్యప్రాచ్య దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. భారతదేశ చమురు, గ్యాస్‌లో దాదాపు 50 శాతం హార్ముజ్ జలసంధి నుండి వస్తుంది. భారతదేశం తన ఎల్ఎన్జీలో 40 శాతం ఖతార్ నుండి, 10 శాతం ఇతర గల్ఫ్ దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. చమురు గురించి చెప్పాలంటే, భారతదేశం 21 శాతం ఇరాక్ నుండి మిగిలినది ఇతర గల్ఫ్ దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే, భారతదేశంలో చమురు ధరలు ఆకాశాన్నంటుతాయన్న ఆందోళనలు మొదలయ్యాయి. అలాగే, భారతదేశం నుండి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసే వస్తువులు కూడా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది ఎగుమతి ఖర్చును పెంచుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)