తెలంగాణలోని చొప్పదండి నీటిపారుదల ఈఈ నూనె శ్రీధర్ను రిమాండ్కు తరలించారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈక్రమంలో ఆయన్ను గురువారం తెల్లవారుజామున చంచల్గూడ జైలుకు తరలించారు. ఏసీబీ సోదాలు మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి. శ్రీధర్కు చెందిన లాకర్లను తెరవడంతోపాటు బ్యాంకు ఖాతాల్లో లావాదేవీల వివరాలను రాబట్టనున్నారు. సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా మరికొన్ని ఆస్తులను గుర్తించే అవకాశముంది. ముఖ్యంగా ఆయనకు బినామీలుగా వ్యవహరించిన వారిని గుర్తించనున్నారు. నూనె శ్రీధర్కు చెందిన 13 ప్రాంతాల్లో బుధవారం అధికారులు తనిఖీలు చేశారు. ఆయనకు సంబంధించి.. తెల్లాపూర్లో విల్లా, షేక్పేట్లోని స్కైహై గేటెడ్ కమ్యూనిటీలో 4,500 చదరపు అడుగుల ఒక ఫ్లాట్, అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్లో మూడు ఫ్లాట్లు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో ఒక్కోటి చొప్పున మూడు భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ల స్థలాలు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో తేలింది. ఈక్రమంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్ను అరెస్టు చేశారు.
ఈఈ నూనె శ్రీధర్ చంచల్గూడ జైలుకు తరలింపు
June 12, 2025
0
Tags