100 డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతిదాడి

Telugu Lo Computer
0

జ్రాయెల్‌ దాడులకు స్పందనగా ఇరాన్‌ 100కి పైగా డ్రోన్లను ప్రయోగించింది. షహీద్-136 శ్రేణికి చెందిన డ్రోన్లు ఇరాక్‌ గగనతలం మీదుగా ఇజ్రాయెల్‌ వైపు ప్రయాణిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే వీటిని వెంటనే గమనించిన ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ వ్యవస్థ వాటిని టార్గెట్‌ చేయడానికి సిద్ధమవుతోందని సమాచారం. రివల్యూషనరీ గార్డ్స్‌ ఇప్పటికే భూభాగాల నుంచి క్షిపణుల ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అలానే ఇజ్రాయెల్‌ చర్యలను ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్‌ చేపట్టిన "ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌" పేరుతో జరిపిన వైమానిక దాడులు ఇరాన్‌కు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, ఆయుధశాలలు, శాస్త్రవేత్తల నివాసాలే లక్ష్యంగా ఈ దాడులు జరగడంతో ఇరాన్‌ వ్యూహాత్మక శక్తికి భారీ దెబ్బ తగిలిందని తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ చీఫ్‌ హొస్సేన్‌ సలామీ, మిలిటరీ చీఫ్‌ మహమ్మద్‌ బాఘేరి వంటి టాప్‌ లీడర్లు మృతి చెందారు. వీరి మృతితో ఇరాన్‌ సైనిక వ్యవస్థలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా తాత్కాలికంగా హబైబొల్లా సయ్యారిను మిలిటరీ చీఫ్‌గా, అహ్మద్‌ వాహిదిని ఐఆర్‌జీసీ చీఫ్‌గా నియమించినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ దాడుల్లో ప్రముఖ అణు శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఫెరెయుద్దీన్‌ అబ్బాసీ, ఆయన కుటుంబసభ్యులు మృతి చెందారని సమాచారం. అలాగే షహీద్‌ బెష్తీ విశ్వవిద్యాలయానికి చెందిన డీన్‌ డాక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ మినౌచెహర్‌, అధ్యాపకుడు అహ్మద్‌ రజా జుల్ఫాఘరి కూడా ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియాలో కథనాలు వెల్లడవుతున్నాయి. వీరంతా ఇరాన్‌ కోసం అణు బాంబుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నవారిగా గుర్తింపు పొందారు. ఈ ఆపరేషన్‌లో 200కి పైగా యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఐడీఎఫ్‌ ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ ఎఫ్ఫే డెఫ్రిన్‌ వెల్లడించారు. వీటిలో ఫైటర్‌ జెట్లు, రీఫ్యూయలింగ్‌ ట్యాంకర్లు, నిఘా విమానాలున్నాయని స్పష్టం చేశారు. మొత్తం 100 టార్గెట్లపై 330 బాంబులు, క్షిపణులతో దాడులు జరిగాయని వివరించారు. లక్ష్యాల్లో నతాంజ్‌, ఫోర్డో, అరక్‌ వంటి అణు కేంద్రాలు, బల్లిస్టిక్‌ మిస్సైల్‌ లాంచ్‌ ప్యాడ్లు, శాస్త్రవేత్తల నివాసాలు, కమ్యూనికేషన్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు పరోక్షంగా స్పందిస్తూ రెండు దేశాలనూ సంయమనం పాటించమని కోరుతున్నాయి. అయితే ఇజ్రాయెల్‌ ప్రధాని మాత్రం తమకు ఉన్న ముప్పును రూపుమాపేందుకే ఈ దాడులు జరిపామని ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)